గాంధీభవన్‌ నిరసనలు

తమకే అనుకూలమన్న రీతిలో టిఆర్‌ఎస్‌

అసంతృప్తులు పార్టీలో చేరుతారన్న ఆశాభావం

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమిలో జరగుతున్న లొల్లి తమకే అనుకూలిస్తుంది. ప్రచారంలో ఇది కలసి వస్తుందని టిఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. సీట్ల కోసం ఇప్పుడు భాగస్వామ్య పక్షాల నుంచి ఎక్కువ సీట్లు కావాలన్న ఒత్తిడి కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో ఫలాన వారికి టిక్కెట్లు ఇవ్వవద్దన్న డిమాండ్డు పెరిగాయి. ఎంతగా అసంతృప్తి పెరిగితే అంగా తమకు ప్రయోజనంగా ఉంటుందని అధికార టిఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఢిల్లీతో పాటు గాంధీభవన్‌ వేదికగా నిరసనలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపిణీ సాఫీగా జరగని పక్షంలో ఓట్ల మార్పిడి తమకే అనుకూలమని నేతల మాటగా ఉంది. ఆశావహులకు నచ్చజెప్పడంతో పాటు భవిష్యత్‌లో అవకాశాలు ఉంటాయిన బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కుమ్ములాటలకు నిలయం అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది.

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు పార్టీపై పూర్తి పట్టు ఉండటంతో ఇలాంటి వాటికి అవకాశాలు పెద్దగా కానరాలేదు. ఈ నేపథ్యంలో రానున్న రెండు మూడు రోజులలో కాంగ్రెస్‌ పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయా అని టిఆర్‌ఎస్‌ ఎదురు చూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత అక్కడక్కడా అసంతృప్త నేతలు టిఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో కూటమి బలపడకూడదన్నదే కేసీఆర్‌ ప్రథమ లక్ష్యంగా ఉది. ప్రత్యామ్నాయ కూటమి అంటూ కొద్ది రోజులపాటు హడావుడి చేసిన కేసీఆర్‌, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు.