గాల్లో ఢీకొన్న జెంట్‌ విమానాలు

బెంగుళూరు ఎయిర్‌షోకు ముందు విషాదం
బెంగళూరు, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : బెంగళూరు సవిూపంలోని యలహంక ఎయిర్‌బేస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన రెండు జెట్‌ విమానాలు గాల్లోనే ఢీకొట్టుకొని భారీ శబ్దంతో కుప్పకూలిపోయాయి. ‘ఎయిరోఇండియా 2019’కు సంబంధించిన రిహార్సల్స్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు అధికారులు వెల్లడించారు.
ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్టు ముందే కిందకి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన పైలట్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఏఎఫ్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబేటిక్స్‌ బృందం మంగళవారం ఉదయం రిహార్సల్స్‌ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తూ గాలిలోనే ఢీకొన్న విమానాలు కాలి బూడిదయ్యాయి. ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలను న్యూస్‌ ఏజెన్సీ ‘ఏఎన్‌ఐ’ ట్వీట్‌ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.  ఎయిరోఇండియా 2019 కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24 వరకు నిర్వహించే ఈ ఎయిర్‌షోలో వివిధ యుద్ధ విమానాలు, పైలట్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.