గుర్రం ఎక్కాడని దళిత పెళ్లికొడుకుపై దాడి

– నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బిల్వారా, జ‌నం సాక్షి ): పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కిన ఓ దళిత యువకుడిని బలవంతంగా కిందకు దించి చితకబాదిన సంఘటన రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లా గోవర్ధన్‌పుర గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పెళ్లికొడుకు తన ఇంటి నుంచి గుర్రంపై బయలుదేరగా, ఆయన కుటుంబ సభ్యులు అతనిని అనుసరించారు. ఇదే సమయంలో అతని గ్రుర్రాన్ని కొందరు గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీ రెచ్చిపోయిన కొందరు గ్రామస్థులు పెళ్లికొడుకుని గుర్రంపై నుంచి కిందకు లాగి దాడి చేశారు. దీంతో పెళ్లికొడుకు ఇంటిముఖం పట్టాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి, ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.