గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ మోడీ పాత్ర

– ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఖట్జూ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర ఉందని ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా జస్టిస్‌ మార్కం డేయ ఖట్జూ పేర్కొన్నారు. ఆయన ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో గోద్రా ఘటనలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్య మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రాష్ట్ర ప్రజలనే ఊచ కోత కోయడం అన్యాయమన్నారు. పాలకులే ఇంత దారుణంగా వ్యవహరిస్తే సామాన్యుల గతి ఏమిటని ప్రశ్నించారు. పాలకపక్షాల దుర్మార్గానికి గోద్రా ఘటన ఓ ఉదాహరణ అని తెలిపారు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పాలకులు అన్యాయానికి పాల్పడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి గోద్రా ఘటనను గుర్తు చేసుకోవాలని అభివర్ణించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చెలాయించే వారికి రాగద్వేషాలు ఉండకూడదని, నా పర భేదం చూపడమంటే అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు.