గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయకూడదు

— జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వరరావు

టేకులపల్లి ,ఆగస్టు 30( జనం సాక్షి ): గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయకూడదని జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వరరావు మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  ఆదేశానుసారం ఈరోజు టేకులపల్లి మండల పరిధిలోని గ్రామీణ వైద్య సహాయకుల(RMP/PMP)తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా సహాయ మలేరియా అధికారి డాక్టర్ గొంది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే వైద్య సహాయం ప్రజలకు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో స్థాయికి మించి వైద్యం చేయరాదని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడంలో కొంతమంది ఆర్ఎంపీలు విశేషంగా కృషి చేస్తున్నారని, కానీ కొంతమంది అనవసరమైన యాంటీబయోటిక్, స్టెరాయిడ్ నొప్పి నివారణ మందులు వాడటం  మూలాన దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యం మీద దుష్ఫలితాలు ఉంటాయని అన్నారు. తమ తమ పరిధిలో మాత్రమే వైద్య సేవలు అందించాలని  అదేవిధంగా  వాడిన సూదులు సిరంజీలు బయో వేస్టేజ్ ని బహిరంగ ప్రదేశాల్లో  పడవేయకుండా పద్ధతి ప్రకారం నాశనం చేయాలని ఈ సందర్భంగా సూచించారు. మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్  మాట్లాడుతూ ప్రతి జ్వరం కేసు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలని, వారికి టీ హబ్ ద్వారా తగిన పరీక్షలు ఉచితంగా చేపించి ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అబార్షన్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో   కీటక జనిత వ్యాధుల నివారణ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణయ్య  మాట్లాడుతూ రక్త కణాల సంఖ్య తగ్గిందని భయపెట్టవద్దని సహజంగా విష జ్వరాలలో  యాంటీబయాటిక్ వాడటం వల్ల రక్త కణాల సంఖ్య తగ్గుతుందని దానికి మంచి ద్రవ పదార్థమైన పండ్ల రసాలు మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని, అలాంటి కేసులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, గ్రామీణ వైద్యులు సత్యనారాయణ , లక్ష్మీనారాయణ, నటరాజ్, శ్రీరామ్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.