గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
ఖమ్మం,ఫిబ్రవరి15(జనంసాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో మండల తహశీల్దార్ను గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు అడ్డుకున్నారు. తమ భూములు జాతీయ రహదారికి ఇచ్చేది లేదని వారు స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా సర్వే చేసి భూములను స్వాధీనం చేసుకుంటే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రెవెన్యూ అధికారులను బాధిత రైతులు హెచ్చరించారు. గతంలోనూ వీరు సర్వేను అడ్డుకున్నారు. భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.