ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ

|
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 16 జనంసాక్షి:
అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో కొన్ని జాతీయ పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి నిజాలు తెలుసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా గురువారం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ నుండి ట్రిపుల్ ప్లాజా వరకు సమైక్య ర్యాలీ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయని, హైదరాబాద్ లో కూడా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, దీనిని సహించలేక, ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రజలు వారి మాటలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ లను అధికారికంగా ఈ నెల 16, 17, 18 మూడు రోజుల పాటు జరుపుకుంటున్నామని, గౌరవ ముఖ్య మంత్రి యావత్ ప్రపంచానికి భారతీయతను గౌరవించే విధంగా జాతీయ సమగ్రతను కాపాడేందుకు సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ర్యాలీ లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి మేయర్ ధన్యవాదాలు తెలిపారు.
నూతనంగా నిర్మించే సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని మేయర్ అన్నారు. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశంలో ఆదర్శంగా నిలిచిందని మేయర్ అన్నారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
3 Attachments • Scanned by Gmail
|



