చంద్రబాబుపై కావాలనే దాడిచేయించారు

– బాబు వెళ్తున్న బస్సుపై పడ్డ లాఠీ ఎవరిది..?

– ప్రభుత్వం వేసిన సిట్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు

– ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

– గవర్నర్‌ స్పందన మాకు సంతృప్తినిచ్చింది

– మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

అమరావతి, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : టీడీపీ అధినేత చంద్రబాబుపై అమరావతిలో కావాలనే ప్రభుత్వం దాడిచేయించిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఘటనపై మంగళవారం టీడీపీ నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. చంద్రబాబు రాజధాని పర్యటనలో ఘర్షణ, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. బాబు పర్యటన సమయంలో జరిగిన దాడి అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తే చెప్పులతో దాడి చేయించారని.. రక్షణ కల్పించామన్న పోలీసు వ్యాఖ్యలు అసత్యమని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్‌కు వివరించారు.అనంతరం అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడారు.. తాము చేసిన ఫిర్యాదుపై గవర్నర్‌ తీవ్రంగా స్పందించారని, ఆయన స్పందన మాకు సంతృప్తిని ఇచ్చింది అన్నారు. పోలీసులకు ఆదేశాలు ఇస్తానని హరిచందన్‌ తమతో చెప్పారన్నారు.

చంద్రబాబు వెళుతున్న బస్సుపై పడ్డ లాఠీ ఎవరిది.. డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌

చేశారు. ఘటనపై డీజీపీ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయని, పర్యటన కోసం తీసుకున్న అద్దె బస్సును సీజ్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన సిట్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, 30మందిని 2వేలమంది పోలీసులు అదుపు చేయలేకపోయారా అంటూ ప్రశ్నించారు.

మంత్రి కొడాలి నాని తీరును తప్పుబట్టిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేయడం దారుణమని అచ్చెన్నాయుడు అన్నారు. కొడాలి నాని బూతులు పోలీసులకు కనిపించలేదా, మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాని చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడారని.. దీన్ని తట్టుకోలేక ఓ మహిళ బాధపడి మంత్రి తీరును తప్పుబట్టిందన్నారు. ఆమెపై చర్యలు తీసుకున్న పోలీసులు.. మంత్రి నానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.