చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్‌: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు రక్షణ లేకపోవడం వ్యవస్థ బలహీనతకు నిదర్శనమని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళలపై అత్యాచారాల నిరోధం కోసం ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకురావడం… ప్రజలు, హక్కుల సంఘాలు సాధించిన విజయంగా వక్తల పేర్కొన్నారు. ఈ చట్టాలను ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అమలు చేయాలన్నారు. లేదంటే ఇప్పటికే దేశంలో ఉన్న వందలాది చట్టాల తరహాలోనే ఇదీ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆడపిల్లలకు చిన్న వయసు నుంచే ఆత్మరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా హింసను. అత్యాచారాలకు గురయ్యే పరిస్థితుల్ని తప్పించుకోవచ్చని సూచించారు.