చదువు ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   చదువు ఒత్తిడి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం బోయినపల్లిలో చోటు చేసుకుంది. బోయినపల్లికి చెందిన కార్తీక్‌ (12) ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఇంటికి వచ్చాడు. తాను ఆ పాఠశాలలో చదవనని తన తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో తిరిగి పాఠశాలకు వెళ్లాల్సి వస్తందన్న భయంతో కార్తీక్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక్‌ తండ్రి మల్లన్న ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఉన్న ఒక సంతానం చనిపోవడంతో మల్లన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది. శవ పరీక్ష కోసం కార్తీక్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.