చివరి కార్తీక సోమవారం
యాదాద్రికి కొనసాగిన భక్తుల రద్దీ
యాదాద్రి,నవంబర్25( జనంసాక్షి): శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకంలో చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. స్వామి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆదివారం నుంచే ధర్మదర్శనం, ప్రసాద విక్రయశాల క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు భక్తులతో నిండిపోయాయి. యాదగిరిగుట్ట పట్టణంలో సైతం ట్రాఫిక్జామ్ ఏర్పడింది. సెలవుదినం కావడం, కార్తీకమాసం ముగుస్తుండడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల
నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి సోమవారం కూడా ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్ చేశారు. భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సరైన వసతులు లేక ఇబ్బందులకు గురయ్యారు. అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా కొండపై స్థలం లేకపోవడంతో కూర్చొని సేదదీరడానికి సైతం భక్తులు అవస్థలు పడ్డారు. బాలాలయంలో స్వామి, అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.