చెరువుల ఆక్రమణలే వరదలకు కారణం

ఆక్రమణలపై అధికారుల నివేదికలు బుట్టదాఖలు
నివేదికలు పట్టించుకోకపోవడంతో నీటమునిగిన నగరం

వరంగల్‌,జూలై18(జనంసాక్షి): ఓరుగల్లులో ఇటీవల కురిసిన భారీ వానలు చెరువుల ఆక్రమణలను బయటపెట్టాయి. పైనుంచి వచ్చిన వరదతో చెరువులు, కుంటలన్నీ నిండిపోయాయి. శిఖం భూములు, బఫర్‌ జోన్లలో ఏర్పాటు చేసిన వెంచర్లన్నీ నీటిలో మునిగాయి. 2020 ఆగస్టులో వరంగల్‌ నగరాన్ని వరదలు ముంచెత్తగా.. చెరువుల గొలుసుకట్టు తెగిపోవడం, కాల్వల కబ్జాలే ఈ పరిస్థితికి కారణమని అధికారులు, నిపుణులు నివేదిక ఇచ్చారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో మరోమారు వరంగల్‌ నగరం అతలాకుతలం అయ్యింది. గత వరదల సమయంలో చుట్టూరా ఉన్న 42 చెరువుల్లో ఇండ్లు కట్టడం వల్ల చెరువులు పూర్తిగా కనుమరుగైనట్లు తేల్చారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు ఒక్కొక్కటిగా మాయం అవుతున్నా నాయకులు, అధికారులు ఏ మాత్రం పట్టింపులేకుండా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కాకతీయుల పాలనలో చెరువులు, కాల్వలు, బావుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినా తరవాతి కాలంలో అవన్నీ మాయం అయ్యాయి. దీంతో వరదలు వచ్చిన సమయంలో వరంగల్‌ త్రినగరాలు నీట మునిగి అల్లాడాయి. ఓరుగల్లు నగరం చుట్టూరా గొలుసుకట్టు విధానంలో ఉన్న దాదాపు 300 చెరువులు, కుంటలు ఇప్పుడు మాయ మయ్యాయి. కానీ వరంగల్‌ అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో చాలామంది రియల్టర్‌, బిల్డర్ల అవతారం ఎత్తి రియల్‌ వ్యాపారం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ
చెరువులు, కుంటలు ఆక్రమించి వెంచర్లు చేశారు. బిల్డర్లు చెరువుల్లోనే ఇండ్లు కట్టి అమ్మేశారు. నేతల అండదండలతో ఓరుగల్లు నగరంలో కాకతీయులు నిర్మించిన చెరువులు, కుంటలు ఒక్కొక్కటిగా కనుమరుగయ్యాయి. చెరువుల గొలుసుకట్టు తెంపేసి బిల్డింగులు, వెంచర్లు చేసి అమ్మేయడంతో వరదలతో
నీరు నగరాన్ని ముంచేసింది. ఎప్పటినుంచో ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడమే వరదలకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవలి వానలకు నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటలు అధికారుల అలసత్వాన్ని కండ్లకు కట్టాయి. అక్రమార్కులు కబ్జా చేసి ఏర్పాటు చేసిన వెంచర్లు, ప్లాట్లు చెరువులు, కుంటల మధ్యలో తేలాడుతున్నాయి. వాస్తవానికి ఎప్పటినుంచో వరంగల్‌ నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని లీడర్లు, ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ.. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. కుడా ఆఫీసర్ల అవినీతి కూడా కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి చెరువుల్లో వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారనే ఫిర్యాదులున్నాయి. ఇదే చెరువులు మాయం కావడానికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చెరువులు నిండడంతో ఆక్రమణలు కళ్లకు కట్టినట్లయింది.
2020లో వచ్చిన వరదల తరువాత చెరువుల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సర్వే చేసి జీడబ్ల్యూఎంసీ పరిధిలో 282 చెరువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ వాటి సంరక్షణ కోసం కనీస చర్యలు చేపట్టడం లేదు. గతంలో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులు, కుంటలు ఇప్పుడు ఎంతమేర మిగిలి ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చెరువు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు, ఇరిగేషన్‌, గ్రేటర్‌ ఆఫీసర్లు, ఎన్‌ఐటీ ప్రొఫెసర్లు పలుసార్లు సమావేశమయ్యారు. చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఫలితంగా ఎక్కడికక్కడ చెరువులు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఈ కారణంగా వరంగల్‌ నరగం నీటమునిగింది.