జగన్‌కు ఆలయ సంప్రదాయాలు పట్టవా?

– హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు
– రాష్ట్రంలో రావణపాలనకు ఇది నిదర్శనం
– పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపునకు కుట్ర పన్నారు
– రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకోం
– టీడీపీ నేత, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు
అమరావతి, అక్టోబర్‌5 (జనంసాక్షి):  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలయ సంప్రదాయాలు పట్టడం లేదని, ఆయన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దైవకార్యాల్లో పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మకు మూలా నక్షత్రం రోజు పట్టువస్త్రాలు ఇవ్వాల్సి ఉందని ఉమా తెలిపారు. దుర్గగుడి సంప్రదాయాలకు విరుద్ధంగా ముందురోజే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడమేంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పర్యటన ఉందని సంప్రదాయాలను పక్కనబెట్టి ముందురోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడమేంటని ఉమా ప్రశ్నించారు. రాష్ట్రంలో రావణ పాలనకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. జలాశయాల్లో నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్నా అసమర్థతతో సముద్రం పాలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపునకు కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. పోలవరంలో తక్కువకు టెండర్లు వేస్తేనే బిల్లులు చెల్లిస్తామంటూ బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. పాలనలోనే జగన్‌ వివక్ష చూపుతున్నారని ఉమా ఆరోపించారు. చంద్రబాబు కార్యాలయంలో పనిచేసిన అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వడం లేదని, వారిని రిలీవ్‌ చేయకుండా వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన కుల వివక్ష చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ ఓ మహిళా ఎంపీడీవో రోడ్డెక్కి నిరసనకు దిగినా పోలీసులు పట్టించుకోరా అని ఉమా నిలదీశారు.