జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో షాక్‌

– పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయలని ఆదేశం
–  మంగళవారానికి విచారణ వాయిదా
అమరావతి, నవంబర్‌8  (జనంసాక్షి)  : జగన్‌ సర్కార్‌కు హైకోర్టు షాకిచ్చింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నవయుగ కంపెనీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయి.
వారం క్రితమే హైడల్‌ ప్రాజెక్ట్‌పై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విచారణలో ఆర్బిట్రేషన్‌ పక్రియ మొదలైన తర్వాత రిట్‌ పిటిషన్‌కు విలువ ఉండదని, ఏజీ వాదనలతో కోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు ఎన్‌క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ను తప్పుబట్టి పక్కకు పెట్టింది. ఏపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టరుతో ఒప్పందం చేసుకునేందుకు అవకాశం హైకోర్టు అవకాశం కల్పించింది. హైడల్‌ ప్రాజెక్ట్‌ విషయంలో ఒప్పందాన్ని ఏపీజెన్‌కో ఏకపక్షంగా రద్దు చేసుకుందని నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పుతో జగన్‌ సర్కార్‌ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు తిరిగి ప్రారంభించింది. కొత్తగా పనులు దక్కించుకున్న మెగా సంస్థ స్పిల్‌వే వెనుక భాగంలో భూమిపూజ నిర్వహించారు.. అనంతరం పనులను ప్రారంభించారు. ప్రాజెక్ట్‌ దగ్గర నీళ్లు, మట్టిని తోడిపోసే పనులు మొదలయ్యాయి. భారీ యంత్రాలు కూడా పోలవరంకు చేరుకున్నాయి. ఈలోపే మళ్లీ హైకోర్టు పనులకు బ్రేకులు వేసింది.