జోధ్పూర్ కోర్టుకు సల్మాన్.. కేసు జూలై 17కు వాయిదా
న్యూఢిల్లీ,మే7(జనం సాక్షి): కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోమవారం జోథ్పూర్ ట్రయిల్ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో గత నెల 5న సల్మాన్కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేయగా, అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఈ తీర్పుకు సస్పెండ్ చేయాలని కోరుతూ సల్మాన్ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా, సెషన్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సోంగరా ఈ పిటిషన్పై జులై 17న వాదనలు విననున్నారు. సోదరి అల్విరా ఖాన్, స్నేహితుడు బాబా సిద్ధిఖీ, అతని న్యాయవాదులఓ కలిసి ఆయన జోథ్పూర్కు చేరుకున్నారు. 1998లో హామ్ సాత్ సాత్ హై సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణ జింకలను వేటాడరంటూ సల్మాన్ సహా నటులు సైఫ్ ఆలీఖాన్, నీలం, టబు, సోనాలి బింద్రే, దుష్యంత్ సింగ్పై కూడా కేసులు నమోదు కాగా, సరైన సాక్షాధారాలు లేక వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్కు శిక్ష పడిన విషయం తెలిసిందే.