టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నిరసన సెగలు

కొత్తగూడెం, మానుకోటల్లో ప్రజల నిలదీత

ఖమ్మం,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రచారంలో తెరాస అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోటల్‌ నిలదీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో ప్రచారానికి వెళ్లిన వెంకటేశ్వర్లును స్థానిక సమస్యలపై గ్రామస్థులు నిలదీశారు. పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు గ్రామస్థులను చితకబాదారు. ఎమ్మెల్యే మైక్‌లో సర్దిజెబుతున్నా వినకుండా స్థానికులపై పిడిగుద్దులు కురిపించారు. తాటి వెంకటేశ్వర్లు ఏ గ్రామంలో ప్రచారం చేపట్టినా స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు. పదవిలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఓట్ల కోసం తమ గ్రామాల్లోకి వస్తున్నారంటూ స్థానికులు తిరగబడుతున్నారు. దీంతో పోలీసుల సంరక్షణలో ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపోతే మహబూబాబాద్‌ జిల్లా గంగారాం మండలం కోమట్లగూడెంలో టీఆర్‌ఎస్‌ ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు భూములు లాక్కుని నిలువనీడ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార రథం ప్లెక్సీలను చించేశారు. ప్రచార రథం తిరగకుండా అడ్డుకోవడంతో పాటు నాయకులతో వాగ్వాదానికి దిగారు