టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా
– టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి లేఖను పంపించిన అవినాష్
– వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం?
విజయవాడ, నవంబర్14 (జనంసాక్షి) : టీడీపీకి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పారు. పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాష్తో పాటూ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. దేవినేని అవినాష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేవినేని అవినాష్ కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదనే మనస్తాపంతో ఉన్నారట. ఈ క్రమంలో బుధవారం గుణదలలోని తన నివాసంలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలతో పాటూ పార్టీ మార్పుపై చర్చించారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. టీడీపీలో సరైన ప్రాధాన్యం లేదని.. ఎక్కువమంది పార్టీ మారాలని అవినాష్పై ఒత్తిడి తీసుకొచ్చారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా అన్యాయం జరుగుతోందని ఇక పార్టీలో కొనసాగినా విలువ లేదని పలువురు కార్యకర్తలు సూచించారు. అలాగే ఏ పార్టీలోకి వెళితే బావుంటుందనే అంశంపైనా చర్చించారని తెలిసింది. ఎక్కువమంది అనచరులు, అభిమానులు వైసీపీలో వెళితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దీంతో ఆయన అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్. విభజనకు ముందు కాంగ్రెస్లో కొనసాగారు. 2014లో కూడా ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత ఇద్దరూ కలిసి టీడీపీలో చేరారు. తర్వాత నెహ్రూ మరణంతో అవినాష్కు చంద్రబాబు ధైర్యంచెప్పారు. తెలుగు యువత బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. కానీ అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం అవినాష్ టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినా.. ఆ వార్తల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు.