టీడీపీ గేమ్ ప్లాన్లో భాగంగానే పవన్ వ్యాఖ్యలు
– ట్విట్టర్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి, సెప్టెంబర్5 (జనం సాక్షి ): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా గురువారం ఖండించారు. టీడీపీతో గేమ్ ప్లాన్లో భాగంగానే.. పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలపై పవన్ ఎప్పుడూ నోరు విప్పలేదని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పవన్ వ్యుహత్మకంగా మౌనం వహించారని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు ఒకటే అనేది అందరికి తెలిసిన విషయమేనని చెప్పారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన భవిష్యత్తు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే చూశారని విమర్శించారు.