ఢిల్లీలోని కేరళ భవన్లో వ్యక్తి హల్చల్
– సీఎం విజయన్ను అంతమొందిస్తానంటూ వ్యాఖ్యలు
– అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు4(జనం సాక్షి) : ఢిల్లీలోని కేరళ భవన్ వద్ద శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. కేరళ ముఖ్యమంత్రిని అంతమొందిస్తానంటూ కేరళ భవన్లోకి ఓ వ్యక్తి కత్తితో దూసుకొచ్చి హల్చల్ చేశాడు. సీఎంను అంతమొదిస్తానంటూ రెచ్చిపోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు ఆయనను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. ఒక చేతిలో కత్తి మరో చేతిలో కొన్ని పేపర్లతో అతడు అక్కడకు వచ్చాడని అధికారులు విూడియాకు తెలిపారు. అతడిని విమల్ రాజ్ (46)గా గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై డీసీపీ మధుర్ వర్మ మాట్లాడుతూ… ‘ఓ గుర్తు తెలియని వ్యక్తి కేరళ భవనంలోకి దూసుకొచ్చి హల్చల్ సృష్టించాడని మాకు సమాచారం అందింది. అతడిని పట్టుకుని ఆరా తీయగా, కేరళలోని కడావూర్ ప్రాంతానికి చెందిన విమల్ రాజ్ అని తెలిసింది. అతడిని అరెస్టు చేశామని అన్నారు. విమల్ రాజ్ వద్ద అతడికి చెందిన కొన్ని వైద్య పత్రాలు ఉన్నాయని, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వాటి ద్వారా తమకు తెలిసిందని చెప్పారు. విమల్ను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.