తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోని వారికి షాక్
ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది
సంచలనంగా ముంబై ధర్మాసనం తీర్పు
ముంబై,జూలై17(జనం సాక్షి): తల్లిదండ్రులను సరిగా చూసుకోని తనయులకు చేదువార్త. వారు తమ పితృదేవులను సక్రమంగా చూసుకునేలా ఇప్పటికే మధ్యప్రదేశ్ తదితర ప్రభుత్వాలు కఠిన చట్టాలనుఅమలు చేస్తున్నాయి. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని, వారిని రాచిరంపాన పెడుతూ హింసించే పుత్రులకు తాజాగా బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. తమ సంతానానికి అందజేసిన ఆస్తిలో కొంత భాగాన్ని తిరిగి వెనక్కి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్ల నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ముంబైలోని అంధేరికి చెందిన ఓ వృద్ధుడు తన ఫ్లాట్లో 50 శాతం భాగాన్ని కుమారుడికి గిఫ్ట్ డీడ్ పేరుతో రాసిచ్చిన ఒప్పంద పత్రాన్ని ట్రిబ్యునల్ రద్దుచేయడాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ సందర్భంగా అమ్మానాన్నలు, వయోవృద్ధుల సంక్షేమకోసం తీసుకువచ్చిన.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ నిర్వహణ, సంక్షేమ చట్టం-2007ను ధర్మాసనం ప్రస్తావించింది. ప్రస్తుతం తాము ఉంటున్న ఫ్లాట్ను గిఫ్ట్ డీడ్ కింద తన పేరుతో బదలాయిస్తే తండ్రితోపాటు, అతడి రెండో భార్య(సవతి తల్లి) బాగోగుల్నిచూసుకుంటానని కుమారుడు, కోడలు చెప్పారు. కానీ, ఆ తండ్రి 50 శాతం వాటాను మాత్రమే కుమారుడికి బదలాయించాడు. దీంతో సవతి తల్లిని సాకుగా చూపుతూ వారిద్దరి బాగోగుల్ని కుమారుడు, కోడలు నిర్లక్ష్యంచేశారు. ఈ అగ్రిమెంట్ను ట్రిబ్యునల్ రద్దుచేయడంలో మాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. ఇది న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్తులు పొంది తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోని తనయులకు చెంపపెట్టులాంటిదన్నారు. దీంతో ఆస్తులు పొంది ఉడాయించడం కుదరదని తీర్పు స్పష్టం చేసిందన్నారు.