‘తాజ్‌’ను కాపాడలేకపోతే కూల్చేయండి

– ప్రభుత్వాల తీరుపై సుప్రింకోర్టు ఆగ్రహం
– తీరు మార్చుకోవాలని సూచన
న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : తాజ్‌ మహల్‌ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడలేకపోతే.. కూల్చేయండని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా ఆ అద్భుత కట్టడాన్ని పరిరక్షించకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది. పర్యావరణ కాలుష్యం నుంచి తాజ్‌ మహల్‌ను సంరక్షించేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ పర్యావరణవేత్త హెచ్‌.సి. మెహతా దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం విచారించిన సుప్రింకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్లిప్తంగా ఉండటం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విూరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి.. తాజ్‌ మహల్‌ వద్ద నిర్వహణా లోపాలను సరిదిద్దండి..  లేకపోతే దాన్ని కూల్చేయండి అంటూ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఈఫిల్‌ టవర్‌ కంటే అందమైంది..
ఫారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే మన తాజ్‌ మహల్‌ ఎంతో సుందరమైందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. టీవీటవర్‌ లాంటి ఈఫిల్‌ టవర్‌ను చూడటానికి ఏటా 8మిలియన్ల మంది వెళ్తున్నారు. మన తాజ్‌ దానికంటే ఎంతో అందమైంది. సరైన నిర్వహణ చర్యలు చేపడితే భారత్‌కు ఆర్థికంగా తోడ్పడుతుంది. విదేశీ కరెన్సీ లోటును భర్తీ చేస్తుంది’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.