తీరుమారని పార్లమెంట్‌

4

– గందరగోళం, వాయిదాల పర్వం

పార్లమెంటులో అదే గందరగోళం

సుష్మా తదితర అంశాలపై వెనక్కి తగ్గని విపక్షం

న్యూఢిల్లీ,ఆగస్టు10(జనంసాక్షి): గందరగోళం మధ్యనే పార్లమెంట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల సస్పెన్షన్‌ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలు సభలోకి నల్లరిబ్బన్లు కట్టుకుని, ఫ్లకార్డులతో సభలోకి వచ్చారు. పాత డిమాండ్‌తో వారు ఆందోళన చేయడంతో ఉభయ సపభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. లలిత్‌మోదీ అంశంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభ ప్రారంభమైన వెంటనే లలిత్‌మోదీ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం కోరగా.. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ దానిని తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ లలిత్‌మోదీకి సాయం చేసింది మానవతా దృక్పథంతో కాదని.. దాని వెనుక వాణిజ్య ప్రయోజనం ఉందని ఆరోపించారు. ఐదు రోజుల సస్పెన్షన్‌ ముగియడంతో 25 మంది కాంగ్రెస్‌ ఎంసీలు పార్లమెంట్‌కు హాజరయ్యారు. లలిత్‌మోదీ వ్యవహారం, వ్యాపం కుంభకోణంపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. ముందు ప్రశ్నోత్తర సమయం జరగాలని తర్వాత చర్చకు అనుమతి ఇస్తామని సభాపతి చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సుష్మా రాజీనామా చేయాల్సిందేనని… ఆ తర్వాతే సభా కార్యక్రమాలు జరుగుతాయని వారు పట్టుపట్టారు. సుష్మాపై కాంగ్రెస్‌ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై సభలో రగడ నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఖర్గే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య ¬రా ¬రీ నినాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. సభ సజావుగ జరిగేందుకు సభ్యులు సహకరించాలని డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అంతకు ముందు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే జార్ఖాండ్‌లోని దియోగఢ్‌లో దుర్గామాత ఆలయంలో తొక్కిసలాటలో మృతిచెందిన వారికి లోక్‌సభ సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సభ్యులు ఆకాంక్షించారు. రెండు రోజుల విరామం అనంతరం పార్లమెంటు సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఝార్ఖండ్‌లో తొక్కిసలాటలో మృతిచెందిన వారికి లోక్‌సభ సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సభ్యులు ఆకాంక్షించారు. అనంతరం వివిధ అంశాలపై సభలో చర్చ చేపట్టారు.