తెలంగాణ రాజ్యాంగబద్ధమైన హక్కు

హక్కుల పోరాటానికి ఓటమి లేదు
ప్రజల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి
గోదావరిఖని, ఫిబ్రవరి 17, (జనం సాక్షి) :
తెలంగాణ ఆకాంక్ష రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుద ర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు మల్లెపల్లి రాజం 19వ స్మారకోపన్యాస్యాన్ని ఆయన అం దించారు. ‘రాజ్యాంగ పాలన – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’ అంశంపై సుదర్శన్‌రెడ్డి సుదీ óర్ఘంగా ప్రసంగించారు. అనేక విషయాలను ప్రస్తావించారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ విషయంలో పాలకులు, ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను, తప్పటడుగులను సరిదిద్దే ప్రయ త్నంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉద్బ Ûవించిందన్నారు. పాలకులకు సంబంధించిన జ యాపజయాలు ప్రజల చేతుల్లోనే ఉంటుందే త ప్ప ప్రజలకు సంబంధించి జయాపజయాలు పాలకుల్లో ఎల్లకాలం ఉండదన్నారు. ఈ సాధన ఉద్యమం పూర్తిగా ప్రజాస్వామికమని, న్యాయ సమ్మతమని, నూరుశాతం ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుందని, ఈ ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యతలు ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలు ఎప్పుడు తమ ఉమ్మడి ఆకాంక్ష విషయంలో రాజీపడిన సందర్భాలు చరిత్రలో లేవని, రాజీకుదిర్చే ప్రయత్నాలు ఫలించబోవని పాలకులు ఈ విషయాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదని పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న వారికి రాజ్యాంగం పట్ల ఎంతకొంత గౌరవం కలిగిన ఇతర ప్రాంతీయులకు కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజ్యం సమాఖ్య స్వభావం దెబ్బతింటుందని, రాజ్యాంగాన్ని భంగపరుస్తుందని, తెలంగాణావాదాన్ని వ్యతిరేకించే వారు గడుసుగా, కొంటెగా అనాలోచితంగా వినిపిస్తున్న వాదనలు సత్యదూరమన్నారు. రాజ్యాంగంలోని అనేక అధికరణలు స్వతంత్రప్రతిపత్తిని గురించి, అనేక విషయాలను చూపిస్తుందన్నారు. దేశ ప్రాదేశిక సమగ్రతను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భంగం కలిగిస్తుందని కొందరు ఇష్టంలేని వారు చేస్తున్న అబద్దపు ప్రచారం బూటకమని పేర్కొన్నారు. ఈ ప్రాంతప్రజల రాజ్యాంగబద్దమైన హక్కులను రక్షించేందుకు పార్లమెంట్‌ చర్య తీసుకునే అవకాశాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతందని ఆరోపించారు. తెలంగాణాలో రాజ్యాంగబద్దమైన పాలన లేదనడానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం కొనసాగుతున్న పోరాటచరిత్రే ఇందుకు నిదర్శనమన్నారు. గతం నుంచి తెలంగాణ ప్రజలకు జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్రప్రభుత్వం 4సంవత్సరాలుగా చెబుతూనే ఉందని తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం నైతికంగా రాజ్యాంగబద్దంగా సరైన మార్గమని సమాఖ్యవాదులు నమ్మాల్సిన అవసరం ఉందన్నారు. సౌభ్రాతృత్వం తెలంగాణావాదంతో అన్ని కోణాల్లో ముడిపడి ఉందన్నారు. రాజ్యాంగ వివేకం కత్తి అంచు వంటిదని, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తాత్కాలిక రాజకీయ లాభాలను త్యాగం చేయాలని, ఆ కత్తిమీద నడవడానికి నిరాకరిస్తే అనేక కోట్లమంది ప్రజలకు రాజ్యాంగబద్దమైన పాలన అందుతుందన్న ఆశ ఆవిరైపోతుందని అన్నారు. బాధ్యత కలిగిన హోంమంత్రి తెలంగాణపై ఇచ్చిన ప్రకటనలోని మాటలను కప్పడంతో ఎందరో ఆత్మహత్యలకు గురయ్యారని, ఈ విషయంలో హోంమంత్రికి ఎటువంటి శిక్షను వేయాలో అందరు ఆలోచించాలన్నారు. న్యాయవ్యవస్థ రాజకీయ ఒత్తిడికి లోనవుతుందనడంలో నిజం లేదన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరిఖని న్యాయమూర్తి సి.విక్రమ్‌, విప్లవ సినీ దర్శకులు ఆర్‌.నారాయణమూర్తి, అడ్వకేట్‌ జాక్‌ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, న్యూఢిల్లీ సామాజిక కార్యకర్త ఆనంద్‌కుమార్‌ బులిమోరా, ఉద్యమ సంఘ నాయకుడు డాక్టర్‌ కనకరాజు, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌, కార్యక్రమ నిర్వాహకులు మాదాసు రాంమూర్తి, పర్లపల్లి రవి, జేవి.రాజు, ఇ.పులేందర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, జనగామ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన రాంపల్లి సాహిత్యకు మల్లెపల్లి పోచం మెమోరియల్‌ గోల్డ్‌మెడల్‌ను ప్రధానం చేయగా, అత్యధిక మార్కులను విద్యార్థులకు సాధించిపెట్టిన సైన్స్‌ ఉపాధ్యాయులు కానుగంటి శ్రీనివాస్‌ను సత్కరించారు. ఈ సదస్సులో తెలంగాణ కళాకారులు దయానర్సింగ్‌, రాజనర్సు, పద్మ, కృష్ణవేణి తదితరులు ఆలపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి.