తెల్లకార్డులు తొలగించారంటూ బాధితుల ఆవేదన

చిలుకూరు: తమ తెల్లకార్డులు తొలగించారంటూ మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కొందరు తహసీల్దారుకు విన్నవించారు. గ్రామానికి చెందిన జనార్ధన్‌, సీతయ్య, చిన్నవెంకయ్య, పెదవెంకయ్యలు తమ తెలుపు కార్డులను అధికారులు తొలగించారని సోమవారం మండల తహశీల్దార్‌ సూర్యనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న అధికారులు తమ తెలుపుకార్డులు తీసివేసినట్లు తెలిపారు. గ్రామంలో దాదాపు 40 మంది వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాల కార్డులను తొలగించలేదని వారు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.