తొలివడతకు ఏర్పాట్లు పూర్తి

అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి: కలెక్టర్‌
వరంగల్‌ రూరల్‌,మే3(జ‌నంసాక్షి): మొదటి విడుతలో ఈనెల 6న జరుగనున్న పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.  అధికారులు తమవిధులను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత సూచించారు. ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీవోలు అన్ని నిబంధనలను పాటించాలని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం, సాయంత్రం సమయంలోనే ఎక్కువ ఓటింగ్‌ శాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అందుకని అధికారులు జాగ్రత్తగా ఓటింగ్‌ పక్రియను పూర్తి చేయాలని, అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఓటర్లకు విధిగా తాగునీటి వసతిని కల్పించాలని సూచించారు.  ప్రధానంగా ఓటర్లు తన గుర్తింపు కార్డును తీసుకువస్తేనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఓటర్ల జాబితాలలోని పేర్లను తప్పకుండా చదివి ఏజెంట్లకు వినిపించిన తర్వాత మాత్రమే ఓటరుకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు
అవరమైన సామగ్రిని సిద్ధం చేసినందున, ఎన్నికల నిర్వహణ కోసం వచ్చే ఉపాధ్యాయులు, సిబ్బందికి జాగ్రత్తగా అప్పగించాలని సూచించారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌ పక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌కు వచ్చేవరకు అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మండల స్థాయి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా సబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఓటింగ్‌ రోజున పోలింగ్‌ స్టేషన్ల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆమె మండల స్థాయి అధికారులకు సూచించారు.