దేశంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి
– ప్రస్తుతం రూ.47వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి
– దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నాం
– మత్స్య పరిశ్రమల అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్
– కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్
విజయనగరం, సెప్టెంబర్6 (జనం సాక్షి ) : దేశవ్యాప్తంగా మత్స్య పరిశ్రమను అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భోగాపురం మండలంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్ను సందర్శించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో చేతల ప్రభుత్వం ఉందని, చెప్పిన ప్రతీ పనిజరుగుతుందన్నారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా దూసుకెళ్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందుకోసం 25 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మత్స్య పరిశ్రమలో దేశంలో ఆంధప్రదేశ్ ముందంజలో ఉందంటూ, ఈ ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో సగటు రొయ్యల
ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు కాగా, దీనిని 9టన్నులకు పెంచాలని నిర్దేశిరచారు. రొయ్యలకు సర్టిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్య శాఖ కమిషనర్ రాం శంకర్ నాయక్ పాల్గొన్నారు.