నక్సలైట్‌ పేరుతో బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

మంచిర్యాల: తాను ఒక నక్సలైట్‌నని, దళ కమాండర్‌నని, మావోయిస్టునంటూ వ్యాపారస్తుల నుంచి డబ్బులు అడుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ సుధాకర్‌ తెలిపారు.

మెదక్‌ జిల్లా సిద్దిపేటలోని పద్మనగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న అట్ల నాగభూషణంకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కూతురు ఇంటర్‌, కొడుకు బీటెక్‌ చదువుతున్నారు. కూలీ పనులతో ఇద్దరు పిల్లలను చదివించడం ఇబ్బందిగా ఉందని ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో 2014లో ఖమ్మం జిల్లా ఎల్లందుకు వెళ్లాడు. అక్కడే బస్టాండులో దొరికిన ఓ దుకాణం కవర్‌పై ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి, తనను నక్సలైట్‌గా పరిచయం చేసుకుని తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు సెల్‌ నంబర్‌ ఆధారంగా నాగభూషణంను అరెస్ట్‌ చేయగా, బెయిల్‌పై బయటకు వచ్చాడు.

అనంతరం అక్కడి నుంచి ఇంట్లో మహారాష్ట్రకు వెళ్లి, రైస్‌మిల్లులో పనిచేస్తానంటూ బయలుదేరి నిజామాబాద్, అక్కడి నుంచి బాసరకు వచ్చాడు. ఈ క్రమంలో అతనిడికి దొరికిన డ్యుయల్‌ సిమ్‌ ఫోనుతో గత నెల ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్మల్‌లోని రెండు షాపుల యజమానులను, ఇంద్రవెల్లిలోని ఒక దుకాణ యజమానిని, మంచిర్యాలలోని ఓ వస్త్ర దుకాణ యజమానికి డబ్బులు ఇవ్వాలని నక్సలైట్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాసర నుంచి నిందితుడు సెల్‌ఫోనులోని సిమ్‌కార్డులు తీసేసి, సిద్దిపేటలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. మంచిర్యాల తులసి దుకాణ వస్త్ర వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దర్యాప్తు ప్రారంభించి, నిందితుడి కాల్‌లిస్టు, ఐఎంఈ నంబర్ల ఆధారంగా సిద్దిపేటకు చెందినవాడిగా గుర్తించి, ఇంటికి వెళ్లి అరెస్టు చేసి, శుక్రవారం రిమాండుకు తరలించారు. ఎస్సైలు లతీఫ్, వెంకటేశ్వర్లు, ఏఎస్సై భవా నీ, హెడ్‌కానిస్టేబుల్‌ ఎండీ తాహిరుద్దీన్‌ పాల్గొన్నారు.