మొదట తాగునీటిపై దృష్టిసారించండి

` ఏపీ, తెలంగాణలకు సూచించిన కేఆర్‌ఎంబీ
` రెండు జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచన
హైదరాబాద్‌(జనంసాక్షి): తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ రెండు రాష్ట్రాల్లో ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు.ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్‌ జలసౌధలో జరిగింది.తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే విషయమై సమావేశంలో చర్చించారు. మే నెలాఖరు వరకు తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిన్నటి సీఈల సమావేశం అనంతరం వివరాలు సమర్పించాయి. ప్రస్తుతం రెండు జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఉన్న కొద్ది పాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది. పక్షం రోజులకు ఒకసారి పరిస్థితులను సవిూక్షించుకుంటూ ముందుకెళ్లాలని రెండు రాష్ట్రాలకు సూచించింది.