నిరక్షరాస్యతను సున్నా చేయడమే లక్ష్యం

– ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పులకు కట్టుబడి ఉన్నాం
– గురుపూజోత్సవంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి
విజయవాడ, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ):  ఏపీని సున్నాశాతం నిరక్షరాస్యతగా రూపుదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ కాలనీలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వులందరికీ వందనాలు. నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు అని వ్యాఖ్యానించారు. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్రపతిగా ఎదిగిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ అందరికీ ఆదర్శమని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురువుల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు చూపించారని అన్నారు. గురువు వెంకటప్పయ్య పేరుతో వైఎస్సార్‌ పులివెందులలో స్కూల్‌ను స్థాపించారని తెలిపారు. వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఇప్పటికీ ఆ స్కూలును నడుపుతోందని అన్నారు. గురువు విద్యార్థుల గుండెలపై ముద్ర వేయగలరు అనేందుకు ఇదే  నిదర్శనమన్నారు. గురువు చేసిన పని ఎవరూ చేయలేరన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నది తన లక్ష్యంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. బ్రిక్స్‌ ఎకానవిూ లెక్కల ప్రకారం కాలేజీలకు వెళుతున్న విద్యార్థులు మన దేశంలో కేవలం 36 శాతమేనని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పుకు కట్టుబడి ఉన్నామన్నారు. దీనిలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్లో మార్పులు తెస్తామని, ప్రతి స్కూల్‌ను ఇంగ్లీషు విూడియం చేయాలని తాపత్రయపడుతున్నానన్నారు. ప్రతి విద్యార్థి గవర్నమెంట్‌ స్కూల్‌కు రావాలనే విధంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు ఆయన అవార్డులు అందజేశారు.