నెలరోజుల్లో..తెలంగాణ అంశంపై నెలరోజుల్లో స్పష్టమైన ప్రకటన

చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శుక్రవారం నార్త్‌ బ్లాక్‌లోని రూమ్‌ నం.3లో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి ఎనిమిది  రాజ కీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజర య్యారని చెప్పారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతంగా జరిగిందన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి వారి అభిప్రాయాలను తెలిపారన్నారు. వాటన్నిం టిని తాను క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పారు. సమావేశ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తానని దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుం టుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, యువత సంయమనంతో శాంతియుతంగా ఉండాలని

ఆయన విజ్ఞప్తి చేశారు. సమవేశంలో కొన్ని పార్టీల ప్రతినిధులు ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్క రించాలని కోరగా, మరికొందరు నెలరోజుల్లోనే పరిష్కరించాలని కోరారని తెలిపారు. సమావేశ వివరాలను  కేంద్రమంత్రి మండలికి వివరి స్తానని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుం టామన్నారు. సమావేశంలో ఏ పార్టీలు ఎలాంటి వైఖరి చెప్పాయని ప్రశ్నించగా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశ వివరాలు ప్రభుత్వానికే వివరిస్తానని, బహిరంగంగా వెల్లడించేందుకు ఇది సరైన వేదిక కాదన్నారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ మినహా అన్ని రాజకీయ పక్షాలు దాదాపు స్పష్టమైన వైఖరి వెల్లడించాయి. ఉదయం పదిగంటలకు ప్రారంభమైన సమావేశం 11.30 గంటలకు ముగిసింది. సమావేశ అనంతరం షిండే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇది నాల్గో భేటీ..

తెలంగాణపై ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించడం ఇది నాలుగోసారి. 2009, డిసెంబరు 7న మొదటిసారి అఖిలపక్షం సమావేశమైంది. రెండోసారి 2010, జనవరి 5న. మూడోసారి 2011, జనవరి 6న అఖిలపక్షం భేటీ అయింది. నాల్గోసారి 2012, డిసెంబరు 28న కేంద్ర హోం మంత్రి షిండే అధ్యక్షతన సమావేశమైంది. అఖిలపక్ష సమావేశం సందర్భంగా నార్త్‌ బ్లాక్‌ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు తరలిరావడంతో ప్రత్యేక బలగాలను మోహరింపజేశారు. సమావేశంలో పాల్గొనేందుకు షిండే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నార్త్‌బ్లాక్‌ వద్దకు చేరుకోగానే తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలు చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు.