నేడు శ్రీకాకుళంలో జగన్‌ పర్యటన

శ్రీకాకుళం,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు పలాస చేరుకొంటారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు నిర్మించదలచిన 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రయోగాత్మకంగా తలపెట్టిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పథకాన్ని అక్కడే సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎచ్చెర్ల చేరుకొని ట్రిపుల్‌ ఐటీలో తరగతి గదులను, హాస్టల్‌ బ్లాకులను ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సింగుపురం వద్ద నిర్మించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను జగన్‌ ప్రారంభిస్తారు.