నేనేంటో ప్రజలకు తెలుసు

1
పిచ్చిరాతలను ప్రజలు పట్టించుకోరు

అంతర్గత సంభాషణలో గవర్నర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌6(జనంసాక్షి): రాజ్‌ భవన్‌లో ఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎంట్రీ ట్యాక్స్‌’పై ఏపీ కాంగ్రెస్‌ నేతలు సోమవారం గవర్నర్‌ ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య అంతర్గత సంభాషణ చోటు చేసుకోగా ఆయన ఇటీవల ఓ విూడియా తనపై రాసిన కథనాలపై స్పందించారని సమాచారం. రెండు రాష్టాల్ర ప్రజల సమస్యలు తనకు తెలుసునని కాంగ్రెస్‌ నేతలతో గవర్నర్‌ అన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడిన మొదటి గవర్నర్‌ ను తానేనని చెప్పారు. ప్రజల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడానని గుర్తు చేశారు. తానేం చేశానో ప్రజలకు తెలుసునని, అందరికంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తానని అన్నారు. ఏం చేసినా ఆలోచించి నిజాయితీగా పనిచేశానని చెప్పారు. ఒకరితో చెప్పించుకునే పరిస్థితి రానివ్వనని గవర్నర్‌ పేర్కొన్నారు. అయితే సమస్యలపై ఇరు రాష్టాల్ర మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తానని గవర్నర్‌ హావిూ ఇచ్చారని కాంగ్రెస్‌ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజ్‌ భవన్‌లో  గవర్నర్‌ తో భేటీ అనంతరం ఏపీ కాంగ్రెస్‌ నేతలు విూడియాతో మాట్లాడారు.  ఏపీలో 500 మండలాల్లో కరువు ఉంటే ప్రభుత్వం 200 మండలాలనే ప్రకటించిందని పీసీసీ చీఫ్‌ రఘువీరా ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఏపీ వాహనాలపై ట్యాక్స్‌ విధింపుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఇరు రాష్టాల్రు ఒకరికొకరు సహకరించుకోవాలని మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు అభిప్రాయ పడ్డారు. అయితే పత్రిక కథనాలను కూడా గవర్నర్‌ దృష్టికి కాంగ్రెస్‌ నేతలు తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో స్పందించిన గవర్నర్‌ కొన్ని పత్రికలు పిచ్చి రాతలు రాస్తే పట్టించుకునేది లేదని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు.