నేల ఆరోగ్యం పై అవగాహన సదస్సు

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి.

ఏ డి ఏ రాంప్రసాద్

టేక్మాల్ జనం సాక్షి డిసెంబర్ 5 టేక్మాల్ మండల పరిధిలోని  టేక్మాల్,కుసంగి, ఎలకుర్తి, ఎల్లుపేట్, కాదులూర్ రైతు వేధికలలో ప్రపంచ నేల దినోత్సవం సందర్బంగా నేల ఆరోగ్యం పై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఇందులో భాగంగా వేసవి కాలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలి భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువులను ఉపయోగించాలి.
సరైన ఎరువుల వినియోగం కొరకు సరైన సమయంలో, సరైన ఎరువుల రకం, సరైన ప్రదేశంలో, సరైన మోతాదులో వేసుకోవడం ద్వారా ఖర్చు తగ్గి దిగుబడి పెరిగి రైతులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది అన్నారు.అవసరాన్ని బట్టి యూరియాను పంటలకు వేసుకోవాలి. మోతాదుకు మించి యూరియా వేయడం వలన చీడ పీడలు ఎక్కువ అయి దిగుబడులు తగ్గుతాయి పంట విత్తిన రెండు వారాల లోపు మొత్తం భాస్వరం ఎరువులను పంటకు వేయాలి పై పాటికి భాస్వరం ఎరువు వాడకం వృధా అవుతుంది. నత్రజని మరియు పొటాష్ ఎరువులను పూత దశకు ముందే వేసుకోవాలి. సమస్యాత్మక నేలల్లో ప్రత్యేక శ్రద్ద పెట్టి జిప్సం, సున్నం మరియు సూక్ష్మ పోషకాలు వేసుకొని సరిచేసుకోవాలి.
రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ, పచ్చిరొట్ట మరియు జీవన ఎరువులు వాడాలని తెలిపారు. సమగ్ర ఎరువుల యాజమాన్యంతో నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారులు జిల్లా కోఆప్షన్ యూసుఫ్,వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు,రైతుసమన్వయ సమితి అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.