పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు

టేకులపల్లి ,ఆగస్టు 18( జనం సాక్షి) : రైతులు వేసే ప్రతి పంటను నమోదు ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు చేయడంతో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పంటల నమోదు ప్రక్రియను క్రాస్ బుకింగ్ యాప్ లో నమోదు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు మండలంలో పర్యటించారు. వెంకటయ్య తండా గ్రామంలో ధారావతు బద్రు అనే రైతు భూమిలో వేసిన పంటను రైతు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. రైతు తెలిపిన వివరాలు యాప్ లో కచ్చితంగా నమోదు ప్రక్రియ జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ఏఈఓ పరిధిలో ఉన్న 5000 ఎకరాలు ప్రతి సర్వే నెంబర్లో వేసి ఉన్న పంటను క్రాఫ్ బుకింగ్ యాప్ లో నమోదు చేయాల్సి ఉన్నది. టేకులపల్లి మండలంలో డీఎస్, నాన్ డిఎస్ కలిపి 59 వేల ఎకరాలు సాగులో ఉండగా ఇప్పటివరకు వరి పత్తి మిర్చి మొక్కజొన్న కంది కలిపి 22 వేల ఎకరాలు యాప్ లో నమోదు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కి మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ తెలిపారు. అనంతరం పత్తి పంటను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ పత్తి పంటలో తామర పురుగు పచ్చ దోమ నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ ప్రిఫోనిల్ లేదా 0.3 గ్రా ప్లానిక మైడ్ మందు కలిపి పిచికారి చేయాలని ఆయన సూచించారు