పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గత ఏడాది జిల్లాలో 7,50 లక్షల క్వింటాల పత్తిని కోనుగోలు చేయడం జరిగిందని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఆర్‌.సంతోష్‌కుమార్‌ తెలిపారు. అన్నారు. జీఎస్టీ ద్వారా ఈ ఏడాది మార్కెట్‌లకు చెందిన చెక్‌పోస్టుల ద్వారా ఆదాయం పెరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆదాయంలో ఖమ్మం జిల్లా నాలుగోస్థానంలో ఉన్నదని, మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాకు రూ.4,320 మద్దతు ధరను నిర్ణయించడం జరిగిందని, రైతులు మార్కెట్‌కు తెచ్చుకునే ముందు తేమ లేకుండా సరుకును తెస్తే మంచి ధర పడుతుందన్నారు. మార్కెట్‌ల ద్వారా అందిస్తున్న సదుపాయానలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అయితే రోజు రోజుకూ పత్తి రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతుంటే పత్తి ధర మాత్రం తగత్గిపోతుందని స్థానిక కాంగ్రెస్‌ నేతలు అన్నారు. మద్దతు ధరలు అన్నవి మిధ్యగా మారాయన్నారు. అధికారులు, దళారులు కలిసి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పార్టీ రంగు పులుముకుని తెరాసకు అనుకూలంగా మారిందని విమర్శించారు. ఇప్పటికే రైతులు వరదలు, నకిలీ విత్తనాలతో చాలా నష్టపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే నరక చతుర్థశి సందర్భంగా వర్తక సంఘం వినతి మేరకు ఈ నెల 19వ తేదీ శనివారం సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు గుండాల కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.