పీఠాలు కదులుతాయనే సమావేశాల పాట

తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత నెల రోజుల్లో ప్రత్యేక రాష్ట్రంపై తేలుస్తామన్నారు. ఆ గడువు దాటిపోయి చాలాకాలం అయింది. అప్పుడు తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నదని మీడియా కోడైకూ సింది. (కాదు.. ఒకవర్గం మీడియా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పురమాయించింది అని చెప్పాలి). ఆ సమయంలో మంత్రి టీజీ వెంకటేశ్‌లాంటి వాళ్లు కూడా తెలంగాణ ఇచ్చేటట్టు ఉన్నారని ప్రకటించారు కూడా. దీంతో అధికారపార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అంతా సమైక్యంగా ఆజాద్‌తో కలిసి నెల గడువును తూచ్‌ మనిపించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. అప్పుడూ ఈ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతి నిధులు నోరు మెదపలేదు. కాంగ్రెస్‌ పార్టీ వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తెలంగాణపై నాన్చివేత ధోరణిని తప్పుపడుతూ సమరదీక్ష సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తెలంగాణ ఉద్యమ నాయకత్వం విమర్శలు చేసిం ది. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను అడ్డుకుంటే చచ్చిన పాము ల్లా ఉన్న ఈ ప్రాంత నేతలు తెలంగాణ ఉద్యమ పార్టీని, నాయ కత్వాన్ని నల్లారివారు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వారికి బాసటగా నిలిచి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.మొన్నటికి మొన్న చలో అసెంబ్లీ సందర్భంగా కిరణ్‌ ప్రభుత్వం తెలంగా ణవాదులపై దమనకాండను ప్రయోగించింది. అయినా ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపా దంతో అణచివేయడానికి పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నేతలు కుయుక్తులు పన్నుతుంటే కుక్కిన పేనుల్లా పడి ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణకు భారీ ప్యాకేజీ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ సమావేశాలు మొదలు పెట్టారు. తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయాన్ని అంగీక రించం అంటున్నారు. సోనియాగాంధీకి లేఖ రాయాలని, నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భారీ మీటింగ్‌ పెట్టాలని నిర్ణయించారు. తెలంగా ణ కోసం వెయ్యి మందికిపైగా బలిదానాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం జరుగు తోంది. వలస ప్రభుత్వ నిర్బంధాలను అధిగ మిస్తూ శాంతియుతంగా ప్రజలు స్వరాష్ట్ర ఆకాంక్షను హస్తినకు చాటిచెప్పడానికి ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పలేని వీళ్లు కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి త్వరలో హస్తినకు వెళతారట! హైదరాబాద్‌లో కిరణ్‌ ప్రభుత్వం చలో అసెంబ్లీ సందర్భంగా ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంటే ప్రేక్షకపాత్ర వహించారు. తెలంగాణ కోసమని సమావేశాలు పెట్టి తెలంగాణను అడ్డుకున్న ఆజాద్‌కు ధన్యవా దాలు తెలిపి, దిగ్విజయ్‌సింగ్‌ నియామకంపై హర్షం వ్యక్తం చేసి తాము కూడా రాష్ట్ర సాధన కోసం ఏదో చెస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు.ఐదున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంశ్రీను కాంగ్రెస్‌ పార్టీ ఒక్క డిసెంబర్‌ 9న తప్ప మరెప్పుడు గౌరవించలేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు కామెడీ కామెంట్లు చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఎక్కడ తెలంగాణపై సాను కూల ప్రకటన వస్తుందో అని సీమాంధ్ర నేతలు మూకుమ్మడిగా మూడు రోజులు హస్తినలోనే మకాం వేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. షిండే పెట్టిన నెల గడువుకు ఆజాద్‌తో కొత్త అర్థాలు చెప్పించారు. ఇలా వచ్చిన తెలంగాణను డిసెంబర్‌ 9 తర్వాత అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారితోనే వేదికలు పంచుకుంటూ ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన ఈ ప్రాంత నేతలు ఇప్పుడు మీటింగులు పెట్టి సోనియాగాంధీకి విన్నపాల లేఖ ఇస్తే ఒరిగేది ఏమిటి? ఈ ప్రాంత విముక్తి కోసం వీరంతా ఒక్కతాటిపై నిలబడి ఉండి ఉంటే కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంపై ఇంత అణచివేతను ప్రయోగించేవాడా? అందుకే ఈ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ కోసం ఎప్పుడు సమావేశాలు పెట్టిన వాటిని చాయ్‌, బిస్కెట్‌ సమావేశాల్లాగానే ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రానికి ప్యాకేజీలు పరిష్కారం కాదని మాటల్లో చెబితే ఢిల్లీ పెద్దల చెవికెక్కదు. సమావేశాలతో సమయం వృథా తప్ప ఫలితం ఉండదనే విషయాన్ని ఈ ప్రాంత కాంగ్రెస్‌ నేతలకు తెలియక కాదు. చలో అసెంబ్లీ తర్వాత ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఆ ఆగ్రహ జ్వాలల్లో తమ సీట్లు దహించుకుపోతాయనే గ్రహించిన నేతలు ఇప్పుడు సమావేశాల పేరుతో తెలంగాణ కోసం తామేదో చేస్తున్నామనే భావన ప్రజల్లో కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే సీమాంధ్ర నాయకులైతే తెలంగాణపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోబోతుంది అనే సమాచారం అందగానే పార్టీలు, జెండాలు, కట్టుబాట్లు పక్కన బెట్టి ఒక్కతాపైకి చేరుతారు. తెలంగాణ నేతలకు మాత్రం ఓట్లల్లో నష్టం కలుగుతుందంటే తప్ప కదలిక రాలేదు. అందుకే ఎటూ తేలని, ఎడతెగని సమావేశాల పేరుతో ప్రజలను మభ్యపెట్టచూస్తున్నారు.
– రాజు