పెళ్లైన కొద్దిరోజులకే వధువు ఆత్మహత్య

చెన్నై: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పెళ్లయిన 24 రోజులకే బలవంతంగా తనువు చాలించింది. చెన్నైలోని ముగలివాక్కం ప్రాంతానికి చెందిన జాస్మిన్‌(25)కి మూడు వారాల క్రితం ట్యూటికోరిన్‌కి చెందిన ప్రతాప్‌తో వివాహమైంది. వివాహమయ్యాక దంపతులు ఇద్దరూ నటరాజన్‌ నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం జాస్మిన్‌ ఆఫీస్‌ నుంచి భర్తకు ఫోన్‌ చేసి ఒంట్లో నలతగా ఉందని ఇంటికి వెళ్లిపోతున్నానని చెప్పింది. సాయంత్రం ప్రతాప్‌ ఇంటికి వెళ్లేసరికి తలుపు గడియపెట్టి ఉంది. ఎంత తట్టినా తీయకపోవడంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి జాస్మిన్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంని ఉంది. భార్యను ఆ స్థితిలో చూసి ప్రతాప్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జాస్మిన్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లయిన కొన్ని రోజులకే జాస్మిన్‌ ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.