పోటులో జరిగింది స్వల్ప అగ్నిప్రమాదమే..

డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ వివరణ

తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): శ్రీవారి ఆలయం వెలుపల గల అదనపు బూందీ పోటులో ఆదివారం జరిగింది స్వల్ప అగ్నిప్రమాదమేనని, ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ వివరణ ఇచ్చారు. బూందీ తయారీ క్రమంలో పోటు కార్మికుడు బాణలిలో నెయ్యి నింపుతుండగా పొరపాటున నెయ్యి డబ్బా జారి పొయ్యి పై పడడంతో మంటలు అంటుకున్నాయి. స్వల్పంగా చెలరేగిన మంటలు బ్లోయర్‌ ద్వారా బయటకు వ్యాపించాయి. దట్టమైన పొగ వెలువడింది. అక్కడున్న సాంకేతిక సిబ్బంది సత్వరం స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి అపాయం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు. కారణంగా పోటును శుభ్రం చేయాల్సి రావడం వల్ల 20 పొయ్యిలను తయారీకి దూరంగా ఉంచడం జరిగింది. అరగంటలో పోటును శుభ్రం చేసి బూందీ తయారీ పక్రియను యధావిధిగా కొనసాగించడం జరుగుతోంది.