ప్రొ॥ కోదండరామ్ను మళ్లీ ఎమ్మెల్సీచేస్తాం
` సుప్రీం కోర్టుకు వెళ్లి పదవిని రద్దు చేయించారు
` ఓయూ పర్యటనలో బీఆర్ఎస్పై రేవంత్ ఆగ్రహం
హైదరాబాద్,ఆగస్ట్25(జనంసాక్షి):ప్రొఫెసర్ కోదండరామ్ను మరో 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్ను ఎమ్మెల్సీగా చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ. కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. గత పదేళ్లలో యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అయినా.. ఎందుకు అంత శునకానందం విూకు అంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఈ యూనివర్సిటీ-నే అని వివరించారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఉస్మానియా యూనివర్సిటీనే అని తెలిపారు. అలాగే యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు రాష్ట్ర సాధనలో భాగంగా సమిధలయ్యారని పేర్కొన్నారు. ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదన్నారు. గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందంటూ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని తాము ఆలోచన చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించామని గుర్తు చేశారు. చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించామని వివరించారు. అనంతరం క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రొ. కోదండరామ్,అవిూర్ అలీఖాన్ సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. అయితే వీరి నియామకాలపై బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా వీరిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మరో 15 రోజుల్లో ప్రొ. కోదండరామ్ను ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.