బందరు పోర్టు భూముల లీజు రద్దు చట్టవిరుద్దం
హైకోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ
మచిలీపట్నం,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాము చేసుకున్న ఒప్పందం రద్దు చేయడం చట్టవిరుద్ధమని, ప్రభుత్వం తన వైఫల్యాన్ని సంస్థ వైఫల్యంగా పేర్కొనడం అన్యాయమంటూ నవయుగ సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. బందరు పోర్టు ప్రైవేట్ లిమిటెడ్కు భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దుచేసి, భూములు వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్ తీర్మానించిన విషయం తెలిసిందే. సంస్థ సకాలంలో పనులు ప్రారంభించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఇంతకు ముందే ప్రభుత్వం 66వ నంబరు జీవోను జారీ చేసింది. ఈ జీవో చట్టవిరుద్ధమని, భూములు అప్పగించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిన కారణంగానే తాము పనులు ప్రారంభించలేకపోయామని తన పిటిషన్లో పేర్కొంది. అయితే పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఏపీ న్యాయవాదుల విధుల బహిష్కరణ కారణంగా12న విచారిస్తామని తెలిపింది.