బస్సును బయటకు లాగిన బాలికలు

దిల్లీ: ఆడవాళ్లు కదా.. ఏం చేయగలరు అనుకునేవాళ్లు ఒక్కసారి ఈ ఫొటో చూస్తే చాలు.. ఆడవాళ్లు అనుకుంటే ఏదైనా సాధించగలరు. అదే రుజువు చేశారు మణిపూర్‌కు చెందిన కొందరు బాలికలు. బురదలో ఇరుక్కుపోయిన వారి స్కూల్‌ బస్సును బయటకు లాగి శభాష్‌ అనిపించారు.మణిపూర్‌కు చెందిన కొందరు బాలికలు లోక్‌తక్‌ సరస్సుకు విజ్ఞానయాత్ర కోసం వెళ్లారు మార్గమధ్యంలో వారు వెళ్తున్న బస్సు బురదలో ఇరుక్కుపోయింది. దీంతో వారంతా కలిసి బస్సుకు తాడు కట్టి బయటకు లాక్కొచ్చారు. ఈ ఫొటోను లవయ్‌ బెమ్‌బెమ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఏప్రిల్‌ 26న పోస్టు చేశారు. అయితే ఈ ఫొటో ఎప్పుడు తీశారో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బాలికల శక్తికి నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ‘వుమనీపూర్‌’ అని కొందరు, భారత్‌లో మేరీకోమ్‌లు ఎందరో ఉన్నారనడానికి రుజువిదేనని మరికొందరు ప్రశంసిస్తున్నారు.