బాబుకు జగన్‌ సర్కార్‌ షాక్‌!

– 14న విజయవాడలో దీక్షకు అనుమతి నిరాకరణ
అమరావతి, నవంబర్‌8 (జనంసాక్షి)  : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్‌ సర్కార్‌ షాకిచ్చింది. ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్‌, మున్సిపల్‌ కమిషనర్లను టీడీపీ కోరింది. స్టేడియాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇచ్చేందుకు అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీక్షకు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టారు. అమనుతి ఇవ్వనంత మాత్రాన దీక్ష ఆగదని.. స్టేడియంకు ప్రత్యామ్నాయంగా విజయవాడలోనే ధర్నాచౌక్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అలాగే విజయవాడలోనే మరికొన్ని ప్రత్యామ్నాయలను పరిశీలిస్తున్నారు. ధర్నాచౌక్‌ను ఓసారి పరిశీలించి.. టీడీపీ నేతలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు ఇసుక కొరత, ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఈ నెల 14న విజయవాడలో దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టీడీపీ అధినేత దీక్ష చేయనున్నారు. ముందు నగరంలోని ఇందియా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్ష చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ప్రత్యామ్నాయలను వెతికే పనిలో ఉన్నారు.