బీజేపీ, ఆరెస్సెస్‌వారు మాత్రమే భారతీయులా? : చిదంబరం

న్యూఢిల్లీ : బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ దక్షిణాదివారిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటల్లో ‘‘మేము’’ అంటే ఎవరు? అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నిలదీశారు. ‘‘మేము నల్లవారితో కలిసి ఉంటున్నాం’’ అన్నారని, ‘‘మేము’’ అంటే ఎవరని ప్రశ్నించారు. కేవలం బీజేపీ/ఆరెస్సెస్ సభ్యులు మాత్రమే భారతీయులని ఆయన భావిస్తున్నారా? అని నిలదీశారు.
అల్ జజీరా ఆన్‌లైన్ షోలో తరుణ్ విజయ్ మాట్లాడుతూ భారతదేశంలో జాత్యహంకారం లేదని, అందుకు నిదర్శనం తమిళనాడు, కేరళ, కర్ణాటక భారతదేశంలో కలిసి ఉండటమేనని, తమ చుట్టూ నల్లవారే ఉన్నారని చెప్పారు. ఆయన ఆరెస్సెస్ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న ‘పాంచజన్య’కు మాజీ ఎడిటర్‌.