భర్తతో విభేదాలు: భార్య ఆత్మహత్య

విజయనగరం,అక్టోబర్‌29(జనం సాక్షి ):  తనతో భర్త మూడు రోజులుగా మాట్లాడడం లేదన్న కారణంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చీపురుపల్లిలో జరిగింది. కొత్తపేటకు చెందిన దేవి (24), చీపురుపల్లికి చెందిన వర్రి జగదీశ్‌లకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగదీశ్‌ తన భార్య దేవితో మాట్లాడడం మానేశాడు. మూడు రోజులుగా భర్త జగదీశ్‌ తనతో మాట్లాడడం లేదని మనస్తాపానికి గురైన దేవి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి మంగళవారం ఉదయం చనిపోయింది. పోస్టుమార్టం కోసం దేవి మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్టు పోలీసులు తెలిపారు.