భారీ వర్షాలకు ఇద్దరి మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత 24గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు. రెండు వేరు వేరు చోట్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారుల వివరణ ప్రకారం..

సింగ్రౌలీ జిల్లాలోని బహారీదంద్‌ గ్రామం వద్ద 24మంది ప్రయాణిస్తున్న ఓ వాహనం నీటిమడుగులో చిక్కుకుంది. ప్రమాదం నుండి 23మంది ప్రయాణికులు తప్పించుకోగా రాంలల్లూ(40) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మరో వైపు మండ్లా జిల్లాలోని బామణీ రోడ్డు వద్ద నీటిమడుగులో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది వారిలో ముగ్గురిని కాపాడగా విమలబాయి(30) నీట మునిగిపోయింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పలు ప్రాంతాలను నీటముంచుతోందని అధికారులు తెలిపారు.