భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త ప్రవీణ్ రిమాండ్….

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 17:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష 30 సంవత్సరాలు అనే మహిళను భర్త కనకం ప్రవీణ్ ఈనెల 15 వ తేదీన కత్తితో పొడిచి చంపినట్లు తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా మృతురాలి తండ్రి అరేపల్లి రవి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తునట్టు తెలిపారు. సంఘటన స్థలానికి తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ దాస సుధాకర్ చేరుకొని వివరాలను నమోదు చేయడం జరిగింది. అనంతరం విచారణ జరిగే క్రమంలో నేరస్తుడు కనకం.ప్రవీణ్ ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. నేరస్తుడు ప్రవీణ్ తన భార్య శిరీష తనకు దూరంగా ఉండడంతో పాటు వేరే వారికి ఫోన్ మాట్లాడడంతో భార్య పై అనుమానం పెంచుకొని అదును చూసి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో భార్య మెడ కోసి హత్య చేసినట్లు తెలిపారు.అనంతరం నిందుతుని వద్ద ఉన్న రక్తపు మరకలు కలిగిన షర్టు, ప్యాంట్ ను స్వాధీనం చేసుకొని నేరస్తున్ని రిమాండ్ కు తరలించడం జరిగిందని తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ తో పాటు చిగురుమామిడి ఎస్సై సుధాకర్ ఉన్నారు.