మధిరలో భట్టికి ఓటమి తప్పదు

నియోజకవర్గానికి చేసిందేవిూ లేదు: టిఆర్‌ఎస్‌

ఖమ్మం,నవంబర్‌24(జ‌నంసాక్షి): మధిరలో ఈ సారి భట్టికి ఓటమి తప్పదని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి లింగాల కమలరాజు పేర్కొన్నారు. వచ్చే నెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని, ఉమ్మడి జిల్లాలోని పదికి పది స్థానాలనూ తామే గెలుస్తామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తుచేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌తో కలిసి ఎంపీ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. గడిచిన 51 నెలల్లో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనటువంటి, కనీసం ఊహించనటువంటి సుమారు 411 సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేసి చూపిందని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వాడకు వెళ్లినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరిస్తున్న తీరును చూసి ఓటమి భయంతోనే భట్టీ విక్రమార్క తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో మహాకూటమి ఘోర పరాజయం పాలవుతుందని ఇప్పటికే గ్రహించిన కూటమి నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌

ఇచ్చి కఖచ్చితమైన దిశానిర్దేశంలో జిల్లాలోని ముఖ్య నాయకులమంతా కలిసి పనిచేస్తూ పదికి పది సీట్లూ గెలవబోతున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలు తమపై చూపుతున్న ఆదరణను చూసి ఏదో జరిగిపోతుందని భయపడుతూ మహాకూటమి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మధిరలో భట్టీ కోటలకు బీటలు వారుతున్నాయన్న భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్లు భట్టివిక్రమార్కను సస్పెండ్‌ చేసిందని, అలాంటి వ్యక్తి మధిర నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని నమ్మడం మనల్నీ మనం మోసం చేసుకోవడమేనని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి లింగాల కమలరాజు పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం వెనుకబాటు తననానికి భట్టియే కారణమన్నారు. పేదవాడికి మోసగాడికి మధ్య మధిర నియోజకవర్గంలో పోటీజరుగుతుందని, సౌమ్యుడైన ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయనకే తమ ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.