మస్తాన్‌ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి

కదరిబాబురావు డిమాండ్‌
సిఎస్‌పురం , జూలై 28 : సిఎస్‌పురం పంచాయితీలో తాత్కాలికంగా ఉద్యోగిగా పనిచేస్తూ విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన గుర్రం చిన్నమస్తాన్‌ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కనిగిరి టిడిపి ఇన్‌ఛార్జి కదిరిబాబురావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన గుర్రం చిన్నమస్తాన్‌ కుటుంబాన్ని శనివారం కనిగిరి టిడిపి ఇన్‌ఛార్జి కదిరిబాబురావు సందర్శించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్నమస్తాన్‌ కుటుంబం నిరుపేద కుటుంబం అని రిలయన్స్‌వారు వెంటనే స్పందించి వారి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో అందించి అలాగే రిలయన్స్‌లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ సందర్బంగా ఆయన అన్నారు. అదే విధంగా మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కందుకూరు డిఎల్‌పిఓ జి సుమతికళ, తహసీల్దారు కె వెంకటేశ్వర్లు, ఇఓఆర్‌డి ఈశ్వరమ్మ తదితరులు మస్తాన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన గుర్రం చిన్నమస్తాన్‌ మృతదేహానికి సంఘటనా స్థలం వద్ద ఎస్‌ఐ షేక్‌ లాలాఅహ్మద్‌ శవపంచనామా నిర్వహించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

తాజావార్తలు