ముంబైలో శ్రీవారి ఆలయానికి స్థలంకేటాయింపు

తిరుమల,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  రాజధాని ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు చేసింది.  దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 6,975 చ.అడుగుల  స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీదేవేంద్ర ఫడ్నవీస్‌ ముంబయిలోని తన అధికార నివాసంలో స్థలం కేటాయింపు ఉత్తర్వులను టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్‌కు అందజేశారు. దేశవ్యాప్తంగా శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముంబయిలో స్థలం కోసం చాలాకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని ప్రధాన ప్రాంతమైన తూర్పు బాంద్రాలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం అనుభవ ఉత్తర్వులను ముంబయి సబర్బన్‌ జిల్లా కలెక్టర్‌ మిలింద్‌ బోరికర్‌ టిటిడి జెఈవోకు అందజేశారు. ఈ స్థలంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంతోపాటు సమాచార కేంద్రాన్ని టిటిడి నిర్మించనుంది.