ముగిసిన స్పెక్ట్రమ్ వేలం, పాల్గొన్న 8 కంపెనీలు
ప్రభుత్వానికి రూ. లక్షా పదివేల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ, మార్రి 26 : టెలికామ్ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. 19 రోజులపాటుసాగి బుధవారం సాయంత్రంతో ముగిసిన ఈ వేలంలో 1.10 లక్షల కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం నాలుగు బ్యాండ్లలో 115 రౌండ్లలో వేలం కొనసాగింది. మొత్తం బిడ్ల విలువ 1,09,874 కోట్ల రూపాయలుగా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం స్పెక్ట్రమ్కు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నందు వల్ల కోర్టు అనుమతి తీసుకుని స్పెక్ట్రమ్నుపొందిన కంపెనీల పేర్లను టెలికాం విభాగం (డాట్) అధికారికంగా ప్రకటించనుంది. తాజాగా ముగిసిన వేలంలో ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికాం, వొడాఫోన్, భారతి ఎ యిర్టెల్ చేతుల్లో ఉన్న స్పెక్ట్రమ్ను విక్రయించారు. వీటి లైసె న్స్ గడువు 2015-16తో ముగియనుంది. 900 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్ బ్యాండ్లో ఈ స్పెక్ట్రమ్ ఉంది. వీటితోపాటు 1800 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ను కూడా ప్రభుత్వం వేలం వేసింది. 22 టెలికాం సర్కిళ్లలో 17 సర్కిళ్లలో ఉన్న స్పెక్ట్రమ్ను వేలంలో ఉంచారు. వేలం నిబంధనల ప్రకారం.. 2,100 మెగాహెట్జ్, 1800 మెగాహెట్ట్ బ్యాండ్లోని కంపెనీలు 33 శాతం, 900 మెగాహెట్జ్, 800 మెగాహెట్జ్ బ్యాండ్లోని కంపెనీలు 25 శాతం సొమ్మును వేలం ముగిసిన 10 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సొమ్మును పన్నెండేళ్ల కాలంలో దశలవారిగా చెల్లించవచ్చు.
ఇప్పటికే తమ చేతిలో ఉన్న స్పెక్ట్రమ్ను మళ్లీ దక్కించుకోవడానికి ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ పోటీ పడటంతో బిడ్స్ విలువ దూసుకుపోయింది. అదనంగా స్పెక్ట్రమ్ను దక్కించుకోవడానికి రిలయన్స్ జియో, టాటా టెలీసర్వీసెస్, టెలీవింగ్స్ (యునినార్) ఎయిర్సెల్లు బిడ్డింగ్లో పాల్గొన్నాయి. 2010 సంవత్సరంలో నిర్వహించిన 3జి వేలం ద్వారా ప్రభుత్వానికి 67,718 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 3జి వేలం, 4జికి అవసరమైన బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ స్పెక్ట్ర మ్ వేలంలో మొత్తం రూ.1,05,000 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి.